అభివృద్ధికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేయండి
వి.జోగేశ్వరరావు
BSBNEWS - ongole
రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం పరచడమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని ఆ కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు చెప్పారు.
బుధవారం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావుతో పాటు సభ్యులు మద్దిపాటి వెంకటరాజు, వి.వి. సూర్యనారాయణరాజు, అసిస్టెంట్ సెక్రటరీ భిక్షం, ఒంగోలు, మార్కాపురం జిల్లాల జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పి. శ్రీనివాసులు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో తొలుత జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలను ఆయా శాఖల అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. ఐసిడిఎస్, డీఆర్డిఎ, వ్యవసాయ, అనుబంధ శాఖలైన పశు సంవర్ధక, ఉద్యాన శాఖలు, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్, విద్యాశాఖ, భూగర్భ, గనులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తమ శాఖలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపు, వినియోగంపై సమగ్రంగా వివరించగా, కమిటీ సభ్యులు బడ్జెట్ వినియోగంపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాల భౌగోళిక స్వరూపం, పారిశ్రామిక హబ్ గా మారుటకు గల అవకాశాలు, పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, పారిశ్రామిక అభివృద్ధి పై రూపొందించిన ప్రణాళికను జిల్లా కలెక్టర్ రాజాబాబు, కమిటీ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ, జిల్లాలో శాఖల వారీగా ఎంత బడ్జెట్ విడుదలైంది. ఎంత మేర ఖర్చు జరిగింది అనే అంశాలపై సమగ్రంగా కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. జిల్లాలో ఏ పథకానికి ఎక్కువ డిమాండ్ ఉందో గుర్తించి, ఆ పథకానికి అధికంగా నిధులు విడుదల అయ్యేలా ఎస్టిమేట్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.
అనంతరం కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై సమగ్ర వివరాలతో పాటు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాల భౌగోళిక స్వరూపం, పారిశ్రామిక హబ్ గా మారుటకు గల అవకాశాలు, పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, పారిశ్రామిక అభివృద్ధి పై డాక్యుమెంట్ రూపకల్పన పై కలెక్టర్ రాజాబాబు ను ప్రత్యేకంగా అభినందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం పరచడమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రతి రూపాయి అర్హులైన ప్రజలకు ఉపయోగపడేలా, ఎక్కడ అవసరమో అక్కడే నిధులు ఖర్చు చేయాలని, పథకాల ద్వారా పేదలకు ఎంత మేర లాభం చేకూరుతోందో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులపై సమీక్ష నిర్వహించామని, అధికారులు పూర్తిస్థాయిలో బడ్జెట్ను ఖర్చు చేసినట్లు తెలిపారన్నారు. సమావేశంలో పలు అంశాలను తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రెండు, మూడు రోజుకొకసారి ప్రజలకు తాగునీటి సరఫరా పరిస్థితి సంతృప్తి కరంగా లేదన్న అంశాన్ని, సమావేశంలో చర్చించిన అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిటీ సభ్యులు మద్దిపాటి వెంకటరాజు మీడియాతో మాట్లాడుతూ, బుధవారం జరిగిన సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలను ఆయా శాఖల వారీగా సమీక్షించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆలోచనా విధానం, విజన్ కు అనుగుణంగా ప్రకాశం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేలా జిల్లా కలెక్టర్ రాజాబాబు రూపొందించిన డాక్యుమెంట్ రూపకల్పన అభినందనీయమన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సక్రమంగా ఖర్చు చేస్తూ, క్షేత్ర స్థాయిలో మార్పు అనేది తీసుకువచ్చి ఆ మార్పు వలన సమాజం అభివృద్ధి పదంలో పయనించేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, డిఆర్డిఎ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు నారాయణ, జోసఫ్ కుమార్, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, ఉద్యానవన శాఖ అధికారి గోపి చంద్, విద్యా శాఖాధికారి రేణుక, మత్స్య, పశు సంవర్ధక శాఖ జేడీలు శ్రీనివాస రావు, వెంకటేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
