ఎస్టీ (యానాదులు) సమస్యల పరిష్కారంపై ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ
BSBNEWS - లింగసముద్రం
కందుకూరు ఎమ్మెల్యే గా ఎన్నికైన వెంటనే ఎస్టీ (యానాదులు) సమస్యల పరిష్కారంపై ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపారు. లింగసముద్రం మండలం పెదపవని(ఎస్టీ కాలనీ)లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రంను ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారబించారు. ఎన్నికలకు ముందు ఇంటింటి ప్రచార సందర్భంలో తమలో చాలామందికి ఆధార్ కార్డులు లేవని, దానివల్ల ప్రభుత్వ పథకాలు అందడంలేదని పలువురు ఎస్టీలు నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. నాగేశ్వరరావు వారి ఇబ్బందులపై సబ్ కలెక్టర్ తో చర్చించి, పెదపవనిలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీలతో పాటు, లింగసముద్రం మండలంలోని పలు గ్రామాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. జనన ధ్రువీకరణ పత్రం లేని వారి నుంచి అర్జీలు స్వీకరించి, వారికి త్వరలో ఆధార్ సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలియజేశారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించటమే లక్ష్యంగా, చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. పేదప్రజల కోసం మహాకూటమి ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తుందని చెప్పారు. ఇలాంటి సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో అనేకమందికి ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికెట్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీచరణ్, ఎంపీడీవో కట్టా శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షులు వేముల గోపాలరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రెపాటి సాంబయ్య, నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ నాయబ్ రసూల్, పలువురు నాయకులు హాజరయ్యారు.

