ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలి
అర్జీల పరిష్కారములో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలి
BSBNEWS - KANDUKUR
సోమవారం నియోజకవర్గంలోని గుడ్లూరు, ఉలవపాడు మండల తహసిల్దార్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ లను ఆదేశించారు. గత కొన్ని వారాలుగా పబ్లిక్ గ్రీవెన్స్ లో కార్యాలయానికి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి పరిష్కారం కోసం తీసుకున్న చర్యల గురించి అధికారులు నుంచి వివరణ అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూ రీ సర్వే పేరిట చాలా అక్రమాలు జరిగాయని వాటి పరిష్కారం కోసం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను 30 రోజుల్లోపు పరిష్కరించే విధంగా చూడాలని అధికారులు ఆదేశించారు. గ్రీవెన్స్ లో వచ్చే ప్రతి అర్జీ ను క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా అర్జీదారులకు పరిష్కారం చూపే విధంగా అధికారులు పనిచేయాలని, చిన్నచిన్న సమస్యల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు సత్వరం న్యాయం జరిగే విధంగా చూడాలని అధికారులు ఆదేశించారు. అధికారులు ప్రజల కోసం బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, అధికారులకు ఇచ్చిన అర్జీలకు పరిష్కారం కాకపోతే నేరుగా తమ కార్యాలయం వద్దకు వచ్చి తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చునని ప్రజలకు ఆయన తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరు కాని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ కు సూచించారు. అనంతరం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ తో మాట్లాడి కందుకూరు నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చూడాలని కోరారు.


.jpeg)
