నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

0

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి 

BSBNEWS - KANDUKUR




అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని పట్టణంలో సిపిఐ కార్యాలయం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో నిరసన చేపట్టి తహశీల్దార్ లావణ్య కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి.సురేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో నిరుపేదలకు చాలీచాలని స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలు లేకుండా నగదు ఇవ్వడం జరిగింది అని, ఆ సమయంలో మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నిరుపేదలకు న్యాయం జరిగేలా స్థలాన్ని కేటాయించి కట్టుకునేందుకు వీలుగా డబ్బులు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్న పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం సరైనది కాదని ఆయన అన్నారు. సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి పి. బాలకోటయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెలల గడుస్తున్న ఎందుకు అమలు చేయడం లేదో కూటమి ప్రభుత్వం నాయకులు పేదలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని రాష్ట్ర అభివృద్ధి చేయడానికి ఎటువంటి నగదు మిగల్చలేదని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన ప్రశ్నించారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన ఇసుక, సిమెంటుతో పాటు అవసరమైన వాటిని ఉచితంగా అందించాలని ఆయన కోరారు. గతంలో టిడిపి ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినప్పుడు టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు అందించే వరకు గలమెత్తి పోరాడింది సిపిఐ పార్టీనేనని ఆయన అన్నారు. ఇప్పటికే పలుమార్లు నిరుపేదలకు ఇల్లు కేటాయించాలని సబ్ కలెక్టర్ కి అర్జీలు ఇవ్వడం జరిగిందని వెంటనే వాటిని పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం కేటాయించి ఇల్లు నిర్మించేందుకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కే మురళి, వై ఆనందమోహన్, నత్తా రామారావు, బొల్లోజుల బాల బ్రహ్మచారి, సిపిఐ నాయకులు ఉప్పుటూరు మాధవరావు, కోటేశ్వరరావు, చేవూరి దుర్గాప్రసాద్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)