ఎన్ సి సి యూనిట్ పునరుద్ధరించండి
కేంద్రమంత్రి కి ఎంపీ వేమిరెడ్

BSB-NEWS కందుకూరు
పట్టణంలో ఉన్న ప్రతిష్టాత్మక టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గతంలో ఉన్న ఎన్సీసీ(నేషనల్ క్యాడెట్ కార్ప్స్) ను తిరిగి పునరుద్ధరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి ఎన్సీసీ పునరుద్ధరణపై వినతి పత్రం అందజేశారు. 31 జనవరి 2026 న మియావాకీ ఫారెస్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కందుకూరులోని టిఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది కాలేజీలో ఎన్సీసీ పునరుద్ధరించేలా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే స్పందించిన ఆయన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఎన్సీసీపై పూర్తి వివరాలు అందించారు. ఏర్పాటుపై కలిగే ప్రయోజనాలు వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యువత అభివృద్ధికి మూలస్తంభంగా పనిచేస్తోందని, యువతలో ఐక్యత, క్రమశిక్షణ, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 1948లో ఎన్ సి సి ప్రారంభం కాగా సరిగా 8 సంవత్సరాల తర్వాత అంటే 1964 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కందుకూరులోని టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ సి సి యూనిట్ ఏర్పడిందని తెలిపారు. 1964 నుండి విజయవంతంగా నడుస్తున్న ఎన్సీసీ విభాగం నుంచి చాలా మంది ఎన్ సి సి క్యాడెట్లు భారత సైన్యం, పోలీసు వంటి వాటిలో చేరి సేవ చేస్తున్నారన్నారని అయితే కళాశాల పరిపాలనలో కొంత లోపం కారణంగా శాశ్వత అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్ అందుబాటులో లేకపోవడంతో 2023 లో టీఆర్ఆర్ కళాశాల నుండి ఎన్ సి సి యూనిట్ను ఉపసంహరించారని వెల్లడించారు. ఎన్ సి సి యూనిట్ మూసివేయడం వల్ల విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడిందని, శిక్షణ పొందాలనుకునే క్యాడెట్లకు దూరమైందన్నారు. ప్రస్తుతం కళాశాలలో సాధారణ అసోసియేట్ ఎన్ సి సి అధికారి ఉన్నారని, మళ్లీ ఎన్సీసీ యూనిట్ను ఏర్పాటు చేయగలిగితే నేవీ శిక్షణతో పాటు తీరప్రాంత విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఎన్ సి సి శిక్షణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ సి సి యూనిట్ను పునరుద్ధరించేలా సంబంధిత అధికారులకు సూచించాలని కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ కళాశాలలో ఎన్సీసీ విభాగం పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని, శిక్షణ, మార్గదర్శకత్వం అవకాశాలను పొందేలా చూస్తామన్నారు. ఎన్సిసి యూనిట్ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావుకి, స్కందపురి సేవా సమితి చైర్మన్ పువ్వాడ మౌనిక కు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రవి కుమార్, పూర్వ విద్యార్థుల కమిటీ చైర్మన్ డాక్టర్ ఐవి నాగరాజారావు లు కృతజ్ఞతలు తెలియజేశారు.
