ప్రభుత్వ పాఠశాలలకు విద్యాంజలి వరం
డీవైఈఓ నరసింహారావు
(కందుకూరు)
పాఠశాలల్లో మౌలిక వనరులను సమకూర్చి తద్వారా విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడమే విద్యాంజలి ముఖ్య ఉద్దేశమని కందుకూరు డీవైఈఓ పి.నరసింహారావు అన్నారు. శనివారం స్ధానిక బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయులు, సీఆర్ఎం టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోర్సు డైరెక్టర్, ఎంఈఓ కె. సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రజల, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న పథకం విద్యాంజలి 2.0 కార్యక్రమని తెలిపారు. ఈ పథకం ద్వారా పాఠశాలలకు అవసరమైన వసతులను దాతల నుంచి సేవా కార్యక్రమాల రూపంలో ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దడానికి తోడ్పడుతుందన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రయాణాల పెంపునకు సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దాతలు తమకు తోచిన రీతిలో పాఠశాలలకు సహకారం అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోర్టల్ లో తమ పాఠశాలలోని సమస్యలు నమోదు చేయాలి. పాఠశాలలో భౌతిక వనరులు, భవన నిర్మాణం, ప్రహరీగోడ, విద్యుత్ సౌకర్యం, తరగతి గది అవసరాలు, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ సామాగ్రి, ఆరోగ్య పరిరక్షణ కిట్లు, బోధన సామాగ్రి, కార్యాలయ అవసరాలు నెరవేర్చడం, పాఠశాల మరమ్మతులు, తదితర అవసరాలను తీర్చవచ్చనని ఆయన సూచించారు. ఎంఈఓ ఎం. నాగ కమార శర్మ మాట్లాడుతూ విద్యాంజలి 2. O ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలల్లో మౌలిక వనరులను సమకూర్చడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుందని, పాఠశాల సర్వతోముఖాభివృద్దికి ఉపాద్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, సీఆర్ఎం టీచర్లకు రిసోర్స్ పర్సన్లు ఎస్ కె షౌకతుల్లా, ఏవి రావు, పివి రమేష్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలుర, మాచవరం హైస్కూల్ హెచ్ఎం లు ఎం. నరసింహమూర్తి, కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
