రాళ్లపాడు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఇంటూరి

0

రాళ్లపాడు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఇంటూరి  

ఎడమకాలువ పనులు పూర్తి చేయాలి

 స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేయండి

 హెడ్ రెగ్యులేటర్ల ఆధునీకరణ కూడా అత్యవసరం

 ఎమ్మెల్యే ప్రశ్నలకు జవాబు ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు

20 నెలల్లో సాగునీటి పనులకు 10.86 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటన

రాళ్లపాడుకు 2.54 కోట్లు ఇచ్చామని వెల్లడి

అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామన్న మంత్రి

BSBNEWS - కందుకూరు


రాళ్లపాడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వాయర్ గేట్లు, హెడ్ రెగ్యులేటర్ల ఆధునీకరణపై అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం గళం వినిపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు కోసం చేసిన కృషిని గుర్తు చేస్తూనే తక్షణం చేపట్టాల్సిన పనుల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు అందించే ప్రధాన వనరు రాళ్లపాడు రిజర్వాయర్ అని పేర్కొన్నారు. 1958 లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. రాళ్లపాడు ఎడమ కాలువ కింద 4,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం కేవలం 1,500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది అని, కాలువను విస్తరించి, చివరన ఉన్న రైతులకు కూడా నీరు అందించాలని కోరారు.
1996 వరదల తర్వాత ప్రాజెక్టు మరమ్మతుల్లో భాగంగా గేట్లు ఏర్పాటు చేసినా, స్టాప్ లాక్ గేట్లు లేకపోవడంతో నీటి విడుదలలో ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.  మెకానికల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, రిపేర్లు చేయటం కష్టంగా ఉంటుందన్నారు.  ప్రాజెక్టు భద్రతకు ముప్పు రాకముందే స్టాప్ లాక్ గేట్లను ఏర్పాటు చేయాలన్నారు. పురాతన పద్ధతిలో రాతి కట్టడంతో ఉన్న హెడ్ రెగ్యులేటర్లను మార్చాల్సిన అవసరం ఉందని, ఆధునీకరణ లేకపోవడంతో గతంలో నీళ్లు ఇవ్వటానికి ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. చివరకు జనరేటర్ సహాయంతో నీళ్లు విడుదల చేశామని, ఆధునిక సాంకేతికతతో హెడ్ రెగ్యులేటర్లను ఆపరేట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరదలు వచ్చినప్పుడు, వేసవి కాలాల్లో రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే ప్రశ్నకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన

రాళ్ళపాడు రిజర్వాయర్ ప్రాజెక్టును 1.10 టీఎంసీల సామర్థ్యంతో 16,000 ఎకరాలకు సాగునీరు, 116 గ్రామాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించారని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఈ రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా 14,500 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 1,500 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాళ్లపాడు ఎడమ కాలువ పనులు అసంపూర్తిగా నిలిచిన మాట వాస్తవం అని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 లో ఈ పనులకు 36.50 కోట్లు మంజూరు చేశామని, కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేశారన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు  కోరినట్లుగా రాళ్లపాడు ఎడమ కాలువ పనులు అత్యవసరమని భావించి, వాటికి రీ-ఎస్టిమేషన్ వేసి, ఆ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాళ్ళపాడు ప్రాజెక్టుకు సంబంధించి ఈ 20 నెలల కాలంలో 48 పనులకు గాను 2.54 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కందుకూరు నియోజకవర్గంలో చెరువులు,  కాలువల రిపేర్లు, ఇతర ఆధునీకరణ సహా 140 పనులకోసం 8.32 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాళ్ళపాడు రిజర్వాయర్ పురాతనమైనది కాబట్టి ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరిన విధంగా స్టాప్ లాక్ గేట్లు, హైడ్రాలిక్ గేట్లు, ఇతర మెకానికల్ మరమ్మతులను పరిశీలించి, ఆ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు

Post a Comment

0Comments
Post a Comment (0)